..

Monday 10 October 2016

నవదుర్గా అలంకారములు : శ్రీశైలం.



11.పదకొండవరోజు అమ్మవారి అలంకారం : శ్రీ భ్రమరాంబికా దేవి. (నిజాలంకారం)

శివపార్శ్వస్థితా మాతా | శ్రీశైలే శుభపీఠికే ||
భ్రమరాంబా మహాదేవీ | కరుణారసవీక్షణా ||


ఒకానొకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. బుద్ధి ఎలా ఉంటుందంటే సృష్టికర్తయైన బ్రహ్మగారిని మేము మోహపెట్టగలము అనుకుంటారు. ఆయనచే తప్పటడుగు వేయించాము అని సంతోషపడిపోతూ వుంటారు. ఆయన బ్రహ్మగారి గురించి ఉగ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి? అని అడిగాడు. అస్త్రశస్త్రములచేత నేను మరణించకూడదు అని కోరుకున్నాడు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. వెంటనే స్వర్గలోకానికి వెళ్ళి దేవతలందరినీ తరిమేశాడు. గోవులను సంహారం చేసేశాడు. బ్రాహ్మణులెవ్వరూ వేదం చదవకూడదని, తనకే హవిస్సులివ్వాలని అన్నాడు. దేవాలయాలన్నింటా నావే మూర్తులు అన్నాడు. ధర్మచక్రం తిరగడంలో అవ్యవస్థ ఏర్పడకూడదు. దేవతలు మర్త్య లోకాన్ని అనుగ్రహించాలి. అలా జరగాలంటే మనము ఒక యజ్ఞమో యాగమో చేసి దేవతలకు హవిస్సు ఇవ్వాలి. అది తీసుకొని వారు అనుగ్రహించి ప్రత్యుపకారంగా వర్షం కురిపిస్తారు. దానివల్ల మనకు పాడి, పంట అన్నీ బాగుంటాయి. ధర్మ చక్రం తిరగడంలో వైక్లవ్యం రాక్షసుల వల్ల వస్తుంది. రాక్షసుడు దేవతలకు హవిస్సు లేకుండా చేసి ఈ ధర్మచక్రం తిరగడాన్ని ఆపాడు. దేవతలందరూ బ్రహ్మగారి వద్దకు వెళ్ళారు. బ్రహ్మగారు అన్నారు - "ఇది నావల్ల అయ్యే పని కాదు. అస్త్రశస్త్ర ప్రయోగము లేకుండా చంపాలంటే, మిమ్మల్ని అనుగ్రహించాలంటే హిమాలయాలకు వెళ్ళి కన్నతల్లి, కరుణామయి జగదంబను ప్రార్థన చేయండి" అని చెప్పారు. అది తపోభూమి. అక్కడ నిలబడి ప్రార్థన చేస్తే ఉత్తరక్షణం ఫలిస్తుంది. వాళ్ళందరూ అక్కడ చేరి ప్రార్థన చేశారు. జగదంబ వాణి వినపడింది - "మీ ఆర్తి నాకు తెలుసు. వాడిని ఎలా చంపాలో నాకు తెలుసు" అని. ఇద్దరిమధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. దేవతలందరూ అమ్మవారి వైపు నిలబడ్డారు. ఎన్ని అస్త్రాలు, శస్త్రాలు వేసినా వాడు మరణించలేదు. అప్పుడు అమ్మవారు భ్రమర రూపాన్ని పొందింది. దేవతలందరూ కూడా భ్రమరాలుగా మారారు. భ్రమరీ రూపంతో వెళ్ళి కాళ్ళతో, తొండంతో, హృదయాన్ని ఛేదించి ఆయువుపట్లని త్రుంచేసింది. దానితో అరుణాసురుడు మరణించాడు. దానితో దేవతలు పరవశించి స్తోత్రం చేశారు. అమ్మవారు అరుణాసుర సంహారం చేసేశాను. మీరు ఇక వెళ్ళి క్షేమంగా ఉండండి అన్నది. దేవతలు అమ్మా! నువ్వు ఒక ఉపకారం చేయాలి. నువ్వు వెళ్ళిపోకూడదు భూమిమీదనుంచి. అవతారానికి ప్రయోజనం అయిపోయిందని వెళ్ళిపోతే మేము మళ్ళీ మిమ్మల్ని కావాలనుకున్నప్పుడు చూసి ప్రార్థన చేయడానికి, పూజ చేసుకోవడానికి సామాన్యుడికి అందవు. అందుకని ఈ భూమండలంమీద ఎక్కడ ఉందామని నువ్వు అనుకుంటున్నావో అక్కడికి వచ్చి వెలసి ఉండవలసినది. అని కోరారు. భ్రమరాంబా దేవికి ఒక లక్షణం ఉంది. అజ్ఞానం అనే తెర ఎత్తడం దగ్గరనుంచి యే పనైనా జటిలమైపోయి జరగనప్పుడు జరిపించగలిగిన శక్తిగా మారి అనుగ్రహిస్తుంది. పరమశివుడు మల్లికార్జున అన్న పేరుతో జ్యోతిర్లింగంగా ఎక్కడ వెలిశాడో అక్కడికి వచ్చి ఈ భ్రామరీ రూప అలంకారాన్ని పొందుతాను. రాక్షససంహారం చేసి ఉపకారం చేశానన్నది నిజమూర్తిగా ఉంటుంది. కానీ పరమశివుని విడిచి ఉండలేని దాన్ని కాబట్టి అర్థనారీశ్వర మూర్తిగా వెలిసి ఉంటానని చెప్పింది. అందుకు మూడు రూపాలతో ఉన్నది. 

ఇప్పటికీ మల్లికార్జున దేవాలయం ప్రక్కకి వెళితే ఉత్తరం వైపుకు వెళితే తూర్పుగా చూస్తూ అర్థనారీశ్వర దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో శివుియొక్క వామార్థ భాగంలో చేరింది భ్రమరాంబా దేవి. నిజమూర్తిని చూడలేము. ఒక్క అర్చకుడు మాత్రమే చూస్తాడు. శక్తి క్షేత్రాలలో 365 రోజులు అభిషేకం చేస్తారు. అలంకారం చేసి తలుపు తీస్తారు. అలంకారం చేస్తే భ్రమర రూపాన్ని పొందుతుంది. భ్రమరాంబా రూపంలో ఉన్న గొప్పతనం యేమిటంటే బొట్టు స్ఫుటంగా కనపడుతుంది. అసల మూర్తిని ఒకే ఒక్కచోట చూడవచ్చు - అది భ్రమరాంబ దేవాలయానికి ఉన్న గడప మీద ఒక చిన్న గాజుపేటిక ఉంటుంది. అందులో ఉంటుంది. అన్నింటికన్నా ఆశ్చర్యం యేమిటంటే దేవాలయానికి తాళం వేసినా అమ్మవారి వెనక గండుతుమ్మెదల బృందాలు ఎన్నో ఉంటాయిట. అందుకే భ్రామరీనాదం వినపడుతుంది. భ్రమరాంబ దేవాలయం వెనక్కి వెళితే గాడి ఉంటుంది. ఆ గాడి దగ్గర చెవి పెట్టి వింటే భ్రామరీనాదం వస్తుంది. దానిని ఆకాశవాణి విజయవాడ, కడప కేంద్రాలు రికార్డు చేసి ప్రసారంచేశాయి. భ్రమరాంబ దేవాలయం మీద ఉన్న శిల్పకళ చూడడానికి ఒకరోజు సరిపోదు. లోపల చూస్తే సంగ్రామ సన్నివేశాల దగ్గరినుంచి నర్తకీమణుల వరకు ఉంటాయి. అక్కడ గోడలమీద సింహాలుంటాయి. వాటి నోటిలో బంతులు లాంటివి ఉంటాయి .అవి త్రిప్పితే తిరుగుతాయి. అవి మళ్ళీ మనకి కంచి మణిమంటపంలో కనపడతాయి.

ఈరోజు మంగళవారం రాత్రి స్వామి,అమ్మవారికి అదికారిక "నందివాహన" సేవ జరుగుతుంది.
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com